Friday 1 March 2013


కోల్‌బెల్ట్‌ రూటు పట్ల రైల్వే నిర్లక్ష్యం


కోల్‌బెల్ట్‌ ప్రాంతాల్లోని ప్రయాణీకుల పట్ల రైల్వేశాఖ మరోమారు తన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. గత దశాబ్దకాలంగా రైలు సౌకర్యాలు మెరుగుపరచాలని, కొత్త రైళ్లు ప్రవేశపెట్టాలని ఈ ప్రాంతంలోని లక్షలాది మంది ప్రయాణీకులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్ఞప్తులను రైల్వే శాఖ అధికారులు, మంత్రులు ఏమాత్రం పట్టించుకోలేదు. మంగళవారం నాడు రైల్వేమంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2013-14 రైల్వే వార్షిక బడ్జెట్‌లో తెలంగాణ ప్రాంత ప్రయాణీకుల పట్లగానీ, బొగ్గు గనులు వ్యాపించి ఉన్న కోల్‌బెల్ట్‌ ఏరియా ప్రయాణీకుల పట్ల గానీ ఎలాంటి కనికరం చూపించలేదు. రామగుండం-మణుగూరుల మధ్య నూతన రైల్వేలైను ప్రతిపాదన గత పదేళ్లకాలం నుండి సర్వే పేరిట పెండింగ్‌లో పెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌లో లక్ష రూపాయలు సర్వే కోసం కేటాయిస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ, వాస్తవంగా సర్వే అమలులోకి వచ్చే అవకాశాలేమీ ఉండవని మరోమారు స్పష్టమైంది. అదిలాబాద్‌ జిల్లా బెల్లంపెల్లి నుండి ఖమ్మం జిల్లా కొత్తగూడెం వరకు వ్యాపించి ఉన్న కోల్‌బెల్ట్‌ రైల్వే రూటులో ప్రతినిత్యం వేలాది మంది ప్రయాణీకులు రైలుపై ఆధారపడి ప్రయాణిస్తుంటారు.
కొత్తగూడెం నుండి బెల్లంపెల్లి, కాగజ్‌నగర్‌ వరకు సింగరేణి ఫాస్ట్‌ ప్యాసింజర్‌ మినహా మరో రైలు సౌకర్యం లేదు. ఈ రూటులో కొత్తగూడెం, డోర్నకల్‌, కాజిపేట, ఉప్పల్‌, జమ్మికుంట, పొట్కాపల్లి, ఓదెల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల్‌, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపెల్లి, కాగజ్‌నగర్‌లు ముఖ్యమైన స్టేషన్లుగా ఉన్నాయి. ప్రతీ రోజూ వేలాది మంది ప్రయాణీకులు సింగరేణి ప్యాసింజర్‌ రైలు ద్వారా ప్రయాణిస్తుంటారు. గత మూడు దశాబ్దాలుగా ఈ రూటులో అదనంగా మరో రైలు ప్రవేశపెట్టాలని వేలాది మంది ప్రయాణీకులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు కూడా రైల్వే మంత్రులకు, దక్షణమధ్య రైల్వే అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. 
ఈ రూటులో నిత్యం బొగ్గు రవాణా వల్ల దక్షిణ మధ్య రైల్వేకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతున్నది. కోల్‌బెల్ట్‌ రూటులో ఉన్న ప్రయాణీకులు తెలంగాణ జిల్లాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా సింగరేణి ప్యాసింజర్‌ రైలు తప్ప మో అవకాశం లేదు. ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల మధ్య ప్రయాణించే వారికి రెండు , మూడు చోట్ల రైళ్లు మారి వెళ్లటం తప్ప మరో మార్గం లేదు. సింగరేణి ప్యాసింజర్‌ రైలు ప్రతీ రోజు ఉదయం కొత్తగూడెం స్టేషన్‌ (భద్రాచలం రోడ్‌) నుంచి బయలుదేరుతుంది. ప్రతీ రోజూ తెల్లవారు జామునే ఈ రైలు బయలుదేరుతున్న కారణంగా, కొత్తగూడెం, భద్రాచలం తదితర ప్రాంతాల ప్రయాణీకులు ముందు రోజు రాత్రికే కొత్తగూడెం చేరుకుని ప్లాట్‌ఫాంపై బస చేస్తుంటారు. కొత్తగూడెం స్టేషన్‌లోనే సింగరేణి ప్యాసింజర్‌ రైలు డబ్బాలన్నీ ప్రయాణీకులతో కిక్కిరిసి ఉంటుంది. ఇక అక్కడి నుంచి బెల్లంపెల్లి వరకు దాదాపు రెండు వందల కిలోమీటర్ల మేర ఉన్న స్టేషన్లన్నింటిలో ఆగినప్పటికీ ప్రయాణీకులు కూర్చునేందుకు సీట్లు లభించడం అసాధ్యంగా ఉంటుంది. మధ్యలో మధ్యలో రైలు ఎక్కేవారందరూ ఏళ్ల తరబడి నిలబడి ప్రయాణం చేస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రులు ఎందరు మారినా, దక్షిణ మధ్యరైల్వే జనరల్‌ మేనేజర్లు ఎంత మంది మారినా కోల్‌బెల్ట్‌ ప్రయాణీకుల తలరాత మారటం లేదు, దక్షణ మధ్యరైల్వే పరిధిలో నడుస్తున్న విద్యుత్‌ రైలింజన్లకు అవసరమైన కరెంటు కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని బొగ్గునుంచే లభిస్తున్న విషయాన్ని కూడా అధికారులు గ్రహించటం లేదు. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో గత దశాబ్ద కాలం నుంచి బొగ్గు ఉత్పత్తి, విస్తరణలో ప్రముఖ కేంద్రాలుగా ఉన్న మణుగూరు, భూపాలపల్లి పట్టణాలను ఇప్పటికీ రైల్వే అధికారులు మెయిన్‌రూటుకు లింక్‌ చేయలేదు. రామగుండం, మణుగూరు రూటు ఆచరణలోకి రావటానికి మరో పదేళ్లు గడిచినా నమ్మకం కుదిరే అవకాశాలు లేవు. దక్షిణ మధ్య రైల్వేకు అత్యంత ముఖ్య ఆదాయం తెచ్చిపెట్టే కోల్‌బెల్ట్‌ రూటు పై రైల్వే అధికారులు, మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం పట్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్ర నిరసన వ్యక్తమౌతున్నది. ఈ రూటులో కనీసం రెండు ఎక్స్‌ప్రెస్‌, రెండు ప్యాసింజర్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైలు సౌకర్యాల కోసం కూడా ఉద్యమాలు చేయాల్సిరావటం అత్యంత సిగ్గుచేటుగా పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోల్‌బెల్ట్‌ రూటు ప్రయాణీకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమైతున్నది.