Thursday 28 February 2013


రామగుండం విద్యుత్‌ కేంద్ర విస్తరణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని వసతులు పుష్కలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత పారిశ్రామిక పురోగతి పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. కొత్తగా పరిశ్రమలేవీ స్థాపించకపోగా గతంలోనే స్థాపించబడిన కొన్ని పరిశ్రమలను మూసివేసి తెలంగాణ అభివృద్ధికి 'గుండె' వంటి 'రామగుండం' పట్ల తీరని ద్రోహం చేస్తున్నది. తాజాగా కిరణ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రేస్‌ పార్టీ ప్రభుత్వం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల విస్తరణలో కూడా రామగుండం ప్రాంతాన్ని చెత్తబుట్టలో పడేసి ఆంధ్రాప్రాంతంలో విస్తరణ పథకాలను ఆమోదించటం తెలంగాణ అభివృద్ధికి మరోమారు విఘాతం కలిగిస్తున్నది. 

Entrance Way to B-Power Project
'థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం' ఎక్కడైనా నెలకొల్పాలంటే 'బొగ్గు', నీరు, రవాణా, స్థలము వంటి ప్రధాన అంశాలు అందుబాటులో ఉండాలనే సాంకేతిక నిపుణులు, పరిశ్రమల వ్యవస్థాపకులు చెబుతుంటారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇవన్నీ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. బ్రిటీష్‌ ఇంజనీర్లు 1948 సంవత్సరంలోనే రామగుండం ప్రాంతాన్ని 'మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియా' గా అభివర్ణించారు. ఇక్కడ గోదావరి నది వల్ల పుష్కలంగా నీరు లభిస్తుంది. మద్రాస్‌-ఢిల్లీ గ్రాండ్‌ట్రంక్‌ రైలు మార్గంలో 'రామగుండం' రైల్వేస్టేషన్‌ ప్రముఖ రవాణా కేంద్రంగా ఉన్నది. హైదరాబాద్‌ నుండి మంచిర్యాల్‌ వరకు 'రాజీవ్‌ హైవే' ద్వారా దేశంలోని అన్ని ప్రధాన రోడ్డు మార్గాలకు రామగుండం లింక్‌ చేయబడింది. అంతర్గాం నుంచి బేగంపేట, రామగిరి ఖిల్లా వరకు దాదాపు యాభై కిలోమీటర్ల పొడవు, ఇరవై కిలోమీటర్ల వెడల్పైన విశాల ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. థర్మల్‌ కేంద్రాలు ఏర్పాటుకు ప్రధాన ముడిసరుకుగా ఉండే 'బొగ్గు' రామగుండం నాలుగు డివిజన్లలోని సింగరేణి బొగ్గు గనుల్లో అందుబాటులో ఉన్నది. ఈ కారణాల దృష్ట్యా బ్రిటీష్‌, నిజాం ప్రభువుల కాలంలోనే ఇక్కడ రామగుండం 'తొలి దీపం' 'ఎ' థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పడింది.

Wednesday 27 February 2013


పారిశ్రామిక ప్రాంతంలో పాలకుల పక్షపాతం?


గోదావరిఖని: ''రాజులు తల్చుకుంటే దెబ్బలకు కొదువా?'' అనేది పాతకాలపు సామెత పాలకులు తల్చుకుంటే కానిదేముంది? అనేది నేటి సామెత. అందులో కాంగ్రేస్‌ పార్టీ నేతలు అధికారంలో ఉంటే ఏదైనా జరగవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తుంటారు. రాష్ట్ర వ్యాపితంగా జరుగుతున్నట్టుగానే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనూ కాంగ్రేస్‌ పాలకులు అనేక చిత్ర విచిత్రాలు జరిపారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు రామగుండం ప్రాంతంలో చురుకైన రాజకీయ పాత్ర నిర్వహించి, ఈ ప్రాంత అభివృద్ధిలో విశేషపాత్ర పోషించిన గీట్ల జనార్ధన్‌రెడ్డిని పాలకులు పూర్తిగా విస్మరించారు. గోదావరిఖని పట్టణ ఆవిర్భావానికి ముందు ఈ ప్రాంతాన్ని 'జనగామ', 'అడ్డగుంటపల్లి' అనే రెండు గ్రామాల పేర్లతో పిలిచేవారు. 1970 నుండి 1980 వరకు 'గోదావరిఖని' పేరిట సింగరేణి సంస్థ బొగ్గు గనులు త్రవ్వకాలు ప్రారంభించి, కాలనీలు విస్తరించేవరకు ఈ రెండు గ్రామాల పేరిటే గోదావరిఖని కొనసాగింది. వృత్తిరిత్యా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఈ ప్రాంతానికి వచ్చిన గీట్ల జనార్ధన్‌రెడ్డి 1972 నుంచి తమ రాజకీయ జీవితం ప్రారంభించారు. 'జనగామ' గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై 'గోదావరిఖని' ఒక పట్టణంగా రూపొందించటానికి కృషిచేశారు. విస్తరిస్తున్న సింగరేణి కాలనీలకు,